కులరహిత విద్యయే 'ఫూలే' దార్శనికత
- వీసీ ప్రొ ఘంటా చక్రపాణి
- ఫూలే పోరాటం భవిష్యత్ తరాలకు ఆదర్శం : సామాజికవేత్త డా. సంగి శెట్టి శ్రీనివాస్
• అంబేద్కర్ వర్శీటీలో 'ఫూలే' తెలుగు సినిమా ప్రివ్యూ
• 'ఫూలే' చిత్ర యూనిట్ ను సన్మానించిన వీసీ ప్రొ. చక్రపాణి
• వర్శీటీలో కొనసాగుతున్న సామాజిక సాధికారత ఉత్సవాలు
హైదరాబాద్, ఏప్రిల్ 11, 2026: కులరహిత విద్యయే 'ఫూలే' లక్ష్యం అని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి అన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో “సామాజిక సాధికార ఉత్సవాల్లో” భాగంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకొని స్మారకోపన్యాసాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రొ. చక్రపాణి మాట్లాడుతూ సనాతన వ్యవస్థ లో అందిరికీ విద్య అందలేదని, అడుగడుగున అణచివేతకు గురవడం జ్యోతిబా ఫూలేను తీవ్రంగా కలచి వేసిందని పేర్కొన్నారు. కుల, సామాజిక హోదా భేదం లేకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విద్యలో సమాన అవకాశాలు ఉండాలని ఫూలే వాదించారని గుర్తు చేశారు. విద్య అనేది సామాజిక పరివర్తనకు, సాధికారతకు ఒక సాధనంగా ఉపయోగపడాలని పేర్కొన్నారు. పక్షపాతం లేకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ వంటి నియంత్రణ సంస్థలు పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సామాజిక పురోగతిని సాధించడానికి, వివక్షను నిర్మూలించడానికి విద్యే అంతిమ సాధనమని తెలిపారు.
కార్యక్రమంలో ప్రధాన వక్తగా విశ్రాంత అధ్యాపకులు, సామాజికవేత్త డా. సంగిశెట్టి శ్రీనివాస్ హాజరై మహాత్మా జ్యోతిరావు ఫూలే స్మారకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో 'శూద్ర', మహిళల విద్యకు జ్యోతిబా ఫూలే పోరాడారని, అది ఆ కాలంలో ఒక విప్లవాత్మకమైన చర్య అని పేర్కొన్నారు. మహిళల హక్కుల కోసం పోరాడారని, లింగ సమానత్వాన్ని సమర్థించారని గుర్తుచేశారు. సమాజంలో బహుజనులకు సరైన స్థానం కోసం కృషి చేశారని పేర్కొన్నారు. సాహిత్యం, సామాజిక సంస్కరణలకు చేసిన సేవలు అపారమైనవని, ఫూలే రచనలను, ఆలోచనలను భవిష్యత్ తరాలకు విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పూలే బాల్యంలో ఎదుర్కొన్న అసమానతలను రూపు మాపడానికి జీవితాంతం కృషి చేశారని ఇది భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమన్నారు. కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ప్రొ.జి.పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించారు. ఆమే మాట్లాడుతూ డా. అంబేద్కర్, మహాత్మా ఫులే సిద్దంతాలు ఆచరనీయమని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి వాళ్ళు చేసిన కృషిని కొనియాడారు. విద్యార్ధులు మహనీయుల జీవిత గాథలను తెలుసుకోవాలని కోరారు. బీసీ సెల్ కో-ఆర్డినేటర్ డా.ఏ. రమాదేవి కార్యక్రమ వివరాలను పేర్కొంటూ ప్రధాన వక్తను సభకు పరిచయం చేశారు. ఇంచార్జి రిజిస్ట్రార్ ఎన్ సి వేణుగోపాల్, ప్రొ. ఆనంద్ పవార్, వీసీ ఓఎస్డీ ప్రొ. రబింద్రనాథ్ సోలమన్, ప్రొ. పల్లవీ కాబడే, ఉద్యోగ సంఘాల నేతలు కాంతం ప్రేమ కుమార్, విశ్వనాథ్, మియాజని, డా యకేశ్ దైదా, విభాగాల అధిపతులు, డీన్స్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్రపటానికి ఘనంగా నివాళి అర్పించారు.
అనంతరం, వర్శీటీ ఆడిటోరియంలో 'ఫూలే' తెలుగు సినిమా ప్రివ్యూను ప్రదర్శించారు. ‘ఫులే’ సినిమా నిర్మాత శ్రీ పొన్నం రవిచంద్ర ఈ చిత్రాన్ని పరిచయం చేస్తూ, అద్భుతమైన కథను తెరపైకి తీసుకువచ్చి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినివ్వడమే ఈ చిత్రం లక్ష్యమని పేర్కొన్నారు. సామాజిక సమానత్వం, సాధికారత కోసం జరుగుతున్న పోరాటంలో ఫూలే కృషికి చాలా ప్రాముఖ్యత ఉందని, సినిమా విడుదలకు సంబంధించి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్త పర్చారు. ఓ మంచి సామాజిక చైతన్యాన్ని కల్పించే భావనతోనే ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఈ సినిమా నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో చిత్ర మాటల రచయిత కత్తి చేతన్ పాల్గొన్నారు. చిత్ర నిర్మాత పొన్నం రవిచంద్ర ను, రచయిత కత్తి చేతన్ లను అంబేద్కర్ విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి సన్మానించారు. ఈ సినిమా అనేక సామాజిక, ఆర్ధిక కోణాలను ప్రస్పుటిన్చేల తీశారని చిత్ర యూనిట్ ను అభినందించారు.
No comments:
Post a Comment